Pages

Sunday, September 16, 2012

వెంకన్న సన్యాసం!


జోగిపురంలో వెంకన్న అనే బీదవాడొకడు ఉండేవాడు. వాడికి భార్య ఇద్దరు పిల్లలు, ముసలితల్లి వుండడంతో, ఎంతకష్టపడినా గోర్రెతోక బెత్తెడే అన్నట్టు సంపాదన తిండికి కూడా సరిపోయేదికాదు. ఆవిధంగా వాడు, నానా కష్టాలకూ లోనవుతూ, ఇక లాభంలేదని సన్యాసం పుచ్చుకోదలచి, అడవిలోవున్న ఒక సన్యాసుల మఠంకేసి బయలుదేరాడు.

వెంకన్న విచారంగా తలవంచుకుని అడవి మార్గాన పోతూండగా, మార్గమధ్యలో ఒక డబ్బు సంచీ వాడి కంటబడింది. వాడు సంచీ తీసుకుని ఎక్కడలేని ఉత్సాహంతో, "నేను సన్యాసం పుచ్చుకోవడం, ఈ చుట్టుపక్కల ఉండే వనదేవతకు ఇష్టం లేనట్టున్నది. అందుకే, ఆ మహాతల్లి కరుణించి మార్గ మధ్యంలో డబ్బు సంచీ పెట్టింది! ఇంటికి తిరిగిపోయి, ఈ డబ్బుతో సుఖంగా బతుకుతాను," అనుకుంటూ పట్టరాని సంతోషంతో వెనుదిరిగాడు. ఆ మరు క్షణం, "ఒరే, ఆగు!" అంటూ పెద్దకేక వినబడింది.

వెంకన్న ఆగి బెదురుగా తలతిప్పి చూశాడు. కండలు తిరిగిన ఇద్దరు దొంగలు, చేతిలో తళతళమెరిసే చురకత్తులతో వాడికంట బడ్డారు. వాళ్ళు దాపులనున్న ఊళ్ళో దొంగతనంచేసి, ఆ డబ్బుతో తమ స్థావరానికి పోతూ, దొంగిలించిన డబ్బులో ఒక సంచీ చేజారి దారిలో పడిపోయిందని గ్రహించారు. వాళ్ళు డబ్బు సంచీ వెతుకుతూ వస్తూండగా, చేతిలో డబ్బూ సంచీతో వెంకన్న కనిపించాడు.

దొంగలిద్దరూ, వెంకన్నను సమీపించి, "నోరు మెదపకుండా, ఆ డబ్బు సంచీ ఇటివ్వు. మేము ఎంతో సాహసించి నేర్పుగా సంపాయించిన డబ్బును, ఉట్టినే దొంగిలించుకు పోదామనుకున్నావా?" అంటూ గద్దించారు.
వెంకన్న వణికిపోతూ, డబ్బు సంచీని దొంగలకిచ్చి, "అయ్యలారా! ఇది మీ సొమ్మని నేనెరగను. ఎంతకష్టపడీ కుటుంబాన్ని పోషించలేక సన్యాసం పుచ్చుకుందామని బయలుదేరాను దారిలో కంటబడిన ఈ డబ్బుసంచీని, నా కష్టాలు తీర్చడానికి ఏ వనదేవతో కరుణించి ప్రసాదించిందని పొరబడ్డాను," అన్నాడు.  ఆ జవాబుకు దొంగలు పెద్దగా నవ్వి, "నీ బీదతనం పోగొట్టేందుకు వనదేవత సాయపడుతుందని లేనిపోని ఆశలు పెట్టుకొకు. అదుగో, ఆ రాళ్ళగుట్ట మలుపు తిరిగావంటే సన్యాసుల మఠం కనబడుతుంది. వాళ్ళీసరికే పొట్టచేతబట్టుకుని, ఊళ్ళవెంట భిక్షాటనకు బయలుదేరి వుంటారు. పోయి, వాళ్ళగుంపులోచేరు," అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారు.
దొంగలమాట వినగానే వెంకన్నకు, సన్యాసులంటే ఏవగింపు కలిగింది. తనకు వ్యవసాయప్పనులు తెలుసు, కాయగూరలు, పండించడం తెలుసు. అలాంటి తను, సంసారం మోయడం భారంగా వున్నదని ముసలి తల్లినీ, కట్టుకున్న భార్యనూ, కన్న పిల్లలనూ వదిలి సన్యాసుల వెంట జోలెకట్టుకుని తన ఒక్కడి తిండికోసం ఊళ్ళు తిరగడమా? చీ!" అనుకుంటూ గబగబా నడిచి ఇల్లు చేరాడు.

వెంకన్న తల్లి, కొడుకు ఏదో విచారంగా వుండడం గమనించి, " ఏరా, వెంకూ! ఏం జటిగిందేమిటి, అలా వున్నావు?" అని అడిగింది. వెంకన్న దాచకుండా జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె, వాణ్ణి ఓదారుస్తూ, "ఆఖరు క్షణంలో ఏ దేవుడో నీకు మంచి బుద్ధి పుట్టించాడు. ఆ సన్యాసులు ఎలా బతుకుతున్నార నుకున్నావు? మనబోటి గృహస్థులు జాలి కొద్దో, ధర్మబుధ్దితోనో వేసే పిడికెడు మెతుకులతో. అయినా, పుచ్చుకునేవారికన్నా ఇచ్చే వారికే పదిమందిలో చాలా గౌరవం కదా!" అన్నది.

" ఆ సంగతి నాకు మాత్రం తెలియదా ఏం," అన్నాడు వెంకన్న కాస్త విసుగ్గా. వెంకన్నతల్లి, ఒక క్షణం ఆగి, "తెలిసుండే సన్యాసుల్లో కలవబోవడం, బుద్ధిగల పనేనా? కష్టమో సుఖమో మరి నాలుగైదేళ్ళు ఓపికపట్టు. నీ కొడుకులిద్దరూ ఈడువాళ్ళవుతారు. వాళ్ళూ నీకు సాయంగా పనిపాటుల్లో కలిసొస్తారు. ఆ తరువాత సంసారం సుఖంగా సాగిపోతుంది," అన్నది.

No comments:

Post a Comment