Pages

Sunday, September 16, 2012

బలమైనశత్రువు

రంగాపురంలో రాజమ్మ పరమగయ్యాళి. ఆమె ఎప్పుడూ ఎవరివో తప్పులు వెతుకుతూండేది. దానికి తోడు ఆమె నోరు కూడా చాలా పెద్దది. అయితే తన కొడుకు వీరయ్య అంటే మాత్రం ఆమెకు చాలా ఇష్టం. ఆమె అతన్ని చాలా ప్రేమతో, ముద్దుగా పెంచింది. కాని ఆమె నోరు మంచిది కాకపోవటాన, వీరయ్యకు పిల్లనియ్యడానికి ఎవరూ ముందుకురాలేదు.

ఒకసారి వీరయ్య ఏదో పనిమీద దూరగ్రామానికి వెళ్ళి, ఆ ఊరి చెరువు దగ్గిర నీళ్ళుతీసుకు వెళుతూన్న ఒక అందమైన అమ్మాయిని చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడై మారు ఆలోచన లేకుండా ఆ పిల్లను అనుసరించి వాళ్ళింటికి వెళ్ళాడు. ఆ పిల్లకు కూడా అతను నచ్చినట్టే కనబడింది.

వీరయ్య ఆ అమ్మాయి పేరు ఇందిర అని తెలుసుకుని, ఆమెను పెళ్ళాడాలని తనకు ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులతో నెమ్మదిగా చెప్పాడు.

"చూడు, నాయనా! నీకు ఒక సంగతి ముందే తెలియటం మంచిది. మా పిల్ల పరమగయ్యాళి. అందుకే దానికి ఒక పట్టాన సంబందం కుదరకుండా ఉన్నది. ఇష్టమైతేనే పెళ్ళాడు," అన్నారు ఇందిర తల్లిదండ్రులు వీరయ్యతో.

వీరయ్య వాళ్ళకు తన తల్లి గురించి చెప్పాడు. అలాటి అత్త ద్వారానైనా తమ కూతురి బుద్ధి మారుతుందని ఆశపడి, వాళ్ళు అతనికి ఇందిర నిచ్చి సంతోషంగా పెళ్ళిచేశారు.

భార్యను వెంటబెట్టుకుని వచ్చిన వీరయ్యను చూసి రాజమ్మ మొదట తెల్లబోయినా, ఆ తరవాత ఎవరో ఒకరు తన కొడుక్కు పిల్లనిచ్చారని సంతోషించింది. పిల్ల అందంగా కూడా ఉన్నది. ఒక నెలపాటు ఆమె కొడుక్కూ, కోడలుకూ ఏ లోటూరానీకుండా అడ్డమైన చాకిరీ చేసింది. తరవాత ఆమెకు, తన చాకిరీ వల్ల కోడలు కూడా సుఖపడుతున్నదని తెలిసివచ్చి, ఆమెకు కూడా పనులు చెప్పసాగింది.

ఒకరోజు వీరయ్య పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వంట సిద్ధంగా లేదు. అత్త కోడలు మీదా, కోడలు అత్తమీదా వందలకొద్దీ నేరాలు చెప్పారు అతనికి. అతను ఇద్దరినీ మందలించబోగా, ఇద్దరూ అతనిమీద విరుచుకుపడి పోయారు.

పెళ్ళాం బెల్లమైపోయిందని తల్లి ఆక్షేపించింది. తల్లి కొంగుపట్టుకుని వేళ్ళాడేవాడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అడిగింది ఇందిర.

వీరయ్యకు అది మొదలు ఇల్లు నరకమైపోయింది. అతను మెతక మనిషి. వాళ్ళిద్దరిమధ్యా నలగటం ఇష్టంలేక, అతను ఇద్దరి మాటలూ పట్టించుకోకుండా ఉండడం అలవాటు చేసుకున్నాడు.

ఒకసారి వీరయ్య కామందుగారి అబ్బాయిని పామువాతపడకుండా కాపాడాడు. కామందు ఆతన్ని మెచ్చుకుని, తనకున్న పాడిపశువుల్లో ఒకటి తోలుకుపొమ్మన్నాడు. వీరయ్య ఈ సంగతి ఉత్సాహంగా ఇంట్లో చెప్పాడు.

"గోమాత ఇంటికి రావడం శుభం!" అన్నది రాజమ్మ.

"గేదెను తోలుకొచ్చుకుందాం.చిక్కనిపాలిస్తుంది," అన్నది ఇందిర.

అది చిలికి చిలికి గాలివాన అయ్యింది. వీరయ్యకు మతిపోయింది. వాళ్ళ వాదన ఆగిపోతుందేమోనని చూశాడు, కాని అది ఆగలేదు. రాజమ్మ ప్రపంచంలోగల గేదెలన్నిటినీ తిట్టిపోస్తున్నది, ఇందిర ఆవులన్నిటినీ దుమ్మెత్తి పోస్తున్నది.

మర్నాడు వీరయ్య పొలంలో కనిపించినప్పుడు కామందు, "నిన్న వచ్చి పశువును తోలుకు పోలేదేం?" అనిఅడిగాడు.

వీరయ్య తన చిక్కు చెప్పాడు.

"నా గేదెలన్నిటినీ సంతకు తోలేశాను. ఆవులు మాత్రమే ఉన్నాయి. ఒక ఆవును తోలుకు వెళ్ళు," అన్నాడు కామందు వీరయ్యతో.

తన సమస్య ఈ విధంగా పరిష్కారమైనందుకు వీరయ్య సంతోషించి, ఈ మాట ఇంట్లో చెప్పాడు. రాజమ్మ సంతోషించి, "మనింటికి గేదె రాకుండా దేవుడే కాపాడాడు," అన్నది.

"గేదెను తెచ్చుకునే అదృష్టం అందరికీ ఉంటుందా?" అన్నది ఇందిర.

అత్తకోడలిమీద లేచింది. కోడలు అత్తకు ఏమీ తగ్గలేదు. ఇద్దరి మధ్యా మళ్ళీ గొడవ ఆరంభమయింది.

వాళ్ళ గొడవ ఇప్పట్లో తగ్గదని తెలిసి వీరయ్య, "నేను వెళ్ళి ఆవును తోలుకొస్తున్నాను," అన్నాడు.

"ఆ తోలుకొచ్చేది నల్ల ఆవుగా చూసితోలుకు రండి. రంగైనా చూసి తృప్తి పడవచ్చు," అన్నది ఇందిర.

"ఏమిటీ, శుభమా అని పాడిపశువును తెచ్చుకుంటూ నల్ల రంగేమిట్రా? తెల్ల రంగు శుభం! తెల్ల ఆవును తోలుకురా," అన్నది రాజమ్మ.

మళ్ళీ అత్తా కోడళ్ళ మధ్య గొడవ పెరిగింది. "నల్ల రంగును తిట్టిపోస్తున్నావు. నువ్వు నల్లగా లేవా?" అని ఇందిర అత్తను అడిగింది.

"నువ్వు తెలుపును ఏమని తిట్టి పోస్తున్నావు? నువ్వు తెల్లగా లేవా?" అని అత్త కోడల్ని అడిగింది.

"తెల్లగా ఉంటే ఉరేసుకునేదాన్ని! నారంగు పచ్చని పసిమి!" అన్నది ఇందిర.

వాళ్ళ గొడవ ఇంతలో తేలదని, వీరయ్య మౌనంగా అన్నం వడ్డించుకుని తినేసి, నిద్రపోయాడు.

రాలేదేమని వీరయ్యను కామందు మళ్ళీ మర్నాడు అడిగాడు. వీరయ్య తన ఇబ్బందిని చెప్పుకున్నాడు.

"నాకు అత్తాకోడళ్ళ బాధలేదు గాని, ఇద్దరు పెళ్ళాలున్నారు. వాళ్ళూ మొదట్లో ఇలాగే కొట్లాడుకునే వాళ్ళు. వాళ్ళ మధ్య చిక్కుకుని చాలా అవస్థ పడ్డాను. చివరకు మంచి ఉపాయం పన్ని, ఇద్దరికీ సఖ్యత కలిగించాను," అన్నాడు కామందు.

"ఆ ఉపాయ మేదో నాకూ చెప్పండి, బాబూ!" అన్నాడు వీరయ్య.

"ఇద్దరు శత్రువులు ఏకం కావాలంటే వాళ్ళకు తమకన్న బలమైన శత్రువు దాపరించాలి!" అన్నాడు కామందు.

"వాణ్ణి ఎక్కడ వెతికేది, బాబూ?" అన్నాడు వీరయ్య.

"నువ్వే!" అన్నాడు కామందు చిన్నగా నవ్వుతూ.

తను ఏం చెయ్యాలో వీరయ్య గ్రహించాడు. అతను ఆ సాయంత్రం కామందు ఇంటి నుంచి ఎర్ర ఆవును తోలుకుని వెళ్ళాడు. అత్తాకోడళ్ళు ఇద్దరూ ఆ ఆవును చూస్తూనే ఒక్కసారిగా అతని మీద విరుచుకుపడ్డారు.

"బతికినన్నాళ్ళు బతకవు, చిన్న వాళ్ళను శాపనార్థాలు పెడతావు, బుద్ధి లేదూ?" అని వీరయ్య తల్లిని నానా మాటలూ అన్నాడు.

మొగుడు తన పక్షం అవుతాడని ఆశపడి ఇందిర మరింత నోరు ఝాడించిండి.

"నీపని ఏదో నువ్వు చూసుకో. మగవాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకు. కామందు ఆవు నిస్తానన్నాడు. నాకు నచ్చిన ఆవు నేను తెచ్చుకున్నాను. దీన్ని గురించి ఏమైనా మాట్లాడావంటే, దీన్ని బాదినట్టే నిన్నూ బాదుతాను జాగ్రత్త," అన్నాడు వీరయ్య పెళ్ళాంతో.

అతను అలా రెండు రోజులపాటు తల్లిని కొట్టినంత పనిచెయ్యటమూ, పెళ్ళాన్నీ అలాగే బెదిరించే సరికి, ఆడవాళ్ళిద్దరూ సఖ్యమయ్యారు. వాళ్ళకు వీరయ్య అంటే భయం పట్టుకున్నది. అతను ఇంట్లో ఉన్నంతసేపూ కుక్కిన పేలలా ఉండి, బయటికి వెళ్ళగానే అతని మీద ఒకరికొకరు చాడీలు చెప్పుకునేవారు. కొన్నాళ్ళకు ఇద్దరి మధ్యా అన్యోన్యత ఏర్పడింది.

No comments:

Post a Comment