Pages

Sunday, September 16, 2012

నిజమైన స్నేహం

అచ్యుతాపురం గ్రామంలోని నారయణ,రాంబాబు మంచి స్నేహితులు.నారాయణ తండ్రి భూషయ్య గొప్ప ఆస్తిపరుడు.కాని పరమ పిసినారి.నారాయణ సాటి మనుషులకు సాయపడే మనస్తత్వం కలవాడు.ముఖ్యంగా బాల్యంలో కొన్నాళ్ళు కలిసి చదువుకున్న రాంబాబు అంటే అతనికి ప్రాణం.తల్లిదండ్రులు లేని రాంబాబుకు ఇల్లు తప్ప మరేదీ లేదు.రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.

పట్నంలో పైచదువులు చదువుకుంటూన్న నారాయణ వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చాడు.ఆ రోజు సాయంకాలం రాంబాబును చూడడానికి వెళ్ళాడు.రాంబాబు దుప్పటి కప్పుకుని పడుకుని మూలుగుతున్నాడు.నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరం.గ్రామంలోని వైద్యుడి దగ్గరికి వెళితే ఏవో మందులిచ్చాడు గాని,జ్వరం తగ్గలేదు.వైద్యం కోసం పక్కనే ఉన్న కృష్ణపట్నానికి వెళ్ళడానికి డబ్బుల్లేవు.

సంగతి తెలుసుకున్న నారాయణ ఇంటికి తిరిగివచ్చి,తండ్రికి విషయం చెప్పి, రాంబాబు వైద్యం కోసం డబ్బడిగాడు.ఆ మాట వినగానే భూషయ్య మండి పడి, "ఏమిటీ,నీ స్నేహితుడి వైద్యానికి డబ్బు కావాలా? ఇలా అందరికీ సాయం చేస్తూ పోతే,నాలుగు రోజుల్లో నేనూ వాళ్ళలా వీధిన పడవలసిందే,"అంటూ కొడుకును గట్టిగా మందలించాడు.

స్నేహితుడికి ఎలాగైనా వైద్యం చేయించాలన్న దృఢనిర్ణయంతో, నారాయణ వడ్డీ వ్యాపారి రంగనాథం వద్దకు వెళ్ళి,ఐదు వందల రూపాయలు అప్పు పుచ్చుకుని మిత్రుణ్ణి బాడుగ బండిలో కృష్ణపట్నానికి తీసుకు వెళ్ళాడు.వారం రోజుల్లో జ్వరం తగ్గి,రాంబాబు ఆరోగ్యం కుదుటపడింది.

 పదో రోజు ఉదయం వడ్డీ వ్యాపారి నారాయణను వెతు క్కుంటూ వచ్చి, "నారాయణ ఉన్నాడా?" అని అతని తండ్రి భూషయ్యను అడిగాడు.

"ఇంట్లో లేడు.అయినా,వాడితో నీకేంపని?" అని అడిగాడు భూషయ్య.

"వారంలో తిప్పి ఇస్తానని చెప్పి,మిత్రుడి వైద్యం కోసం ఐదు వందలు అప్పు చేశాడు.పది రోజులయింది.ఇంకా ఇవ్వలేదు," అన్నాడు వడ్డీ వ్యాపారి.

"అలాగా!" అంటూ ఆగ్రహంతో ఇంట్లో పలికివెళ్ళిన భూషయ్య,తన పరువు కాపాడుకోవడానికి ఐదు వందల రూపాయలు తెచ్చి వడ్డీవ్యాపారికిచ్చాడు.అతడు వెళ్ళిపోయాడు.

కొంతసేపటికి నారాయణ ఇంటికి రావడంతో,"ఏమిటి నీ నిర్వాకం! వడ్డీవ్యాపారి వద్ద అప్పు చేసి నా పరువు తీస్తావా?" అని నిలదీశాడు.

"నా మిత్రుడు ప్రాణాల మీదికి వస్తే,మరో మార్గం లేక అప్పు చేయవలసి వచ్చింది.ఇందులో పరువు ప్రసక్తి ఏముంది నాన్నా? డబ్బు, డబ్బు అంటూ నువ్వు సరైన సమయంలో వైద్యం చేయించకపోవడం వల్లే కదా అమ్మ కన్నుమూసింది.అయినా ఇంకా నీకు తెలిసి రావడం లేదు.అవసరాలకు పనికిరాని డబ్బు ఎందుకు? వెళ్ళేప్పుడు మూట గట్టుకు వెళతామా?" అన్నాడు నారాయణ బాధగా.

అంతలో అక్కడికి వచ్చిన రాంబాబు,"క్షమించండి, భూషయ్యగారూ.నా కారణంగా మీ మధ్య గొడవలు వద్దు.ఇదిగో వడ్డీవ్యాపారికి మీరిచ్చిన ఐదు వందల రూపాయలు. వడ్డీ వ్యాపారి దారిలో ఎదురుపడి సంగతి చెప్పాడు.మా ఇంటి పత్రాలు ఆయన వద్ద తాకట్టు పెట్టి ఈ ఐదు వందలు తెచ్చాను.మరో యేడాది కష్టపడితే పత్రాలు విడిపించుకోగలను," అన్నాడు.

ఆ తరవాత నారాయణకేసి తిరిగి, "సమయానికి వచ్చి ఆదుకుని నిజమైన స్నేహితుడనని నిరూపించావు.నీ రుణం తీర్చలేనిది.నీ మేలు ఈ జన్మకు మరిచిపోను," అన్నాడు రాంబాబు అతడి చేతులు పట్టుకుంటూ.

ఇద్దరి మిత్రుల స్నేహబంధాన్ని చూసిన భూషయ్యలో కూడా మార్పు వచ్చింది.ఆ రోజు నుంచి పిసినారితనం వదులుకుని అవసరాల్లో ఉన్న వారికి సాయపడడం అలవరుచుకున్నాడు.

No comments:

Post a Comment