Pages

Sunday, September 16, 2012

రెక్కలదేవత!

కన్నయ్యకు పన్నెండేళ్ళ వయసులో విషజ్వరం వచ్చి హఠాత్తుగా తల్లి పోయింది. వాడికి తల్లి అంటే పంచప్రాణాలు. తండ్రి జంగయ్య ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా, ``నాన్నా, అమ్మ కావాలి,'' అంటూ తరచూ కళ్ళనీళు్ళ పెట్టుకునేవాడు. తల్లిపోయి యేడాది అయినా ఇంకా నిద్రలో తల్లిని కలవరించేవాడు. అది చూసి జంగయ్య బంధువులు, ``నీకు పెళ్ళాం అవసరం లేకపోయినా, కన్నయ్య ఆలనాపాలనా చూసుకోవడానికి తప్పక అమ్మకావాలి. మా మాట విని మళ్ళీ పెళ్ళి చేసుకో,'' అని జంగయ్యకు చెప్పసాగారు. దానికి తోడు వరసకరువులతో విసిగిపోయిన జంగయ్య, పల్లెలో ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి, ఆ డబ్బుతో దాపులనున్న పట్నంలో చిన్న కిరాణా దుకాణం తెరిచాడు. అయితే, పట్నంలో అద్దెలు ఎక్కువ గనక, కాపురం మాత్రం పల్లె నుంచి మార్చలేదు. జంగయ్య చీకటితో వంట చేసి పట్నం వెళ్ళి, రాత్రి పొద్దు పోయి తిరిగి వచ్చాక మళ్ళీ వంట చేసేవాడు. బడి నుంచి సాయంత్రం తిరిగి వచ్చే కన్నయ్య, తండ్రి వచ్చేంతవరకు ఎదురు చూపులు చూస్తూ ఒక్కడే బిక్కు బిక్కుమంటూ ఇంట్లో ఉండవలసి వచ్చేది. ఇవన్నీ చూసి జంగయ్య తనకు ఇష్టం లేకపోయినా దూరపు బంధువైన జగదీశ్వ రిని పెళ్ళి చేసుకున్నాడు. జగదీశ్వరి కాపు రానికి వచ్చిన రోజే, ``మా కన్నయ్య కోసమే నిన్ను చేసుకున్నాను. తల్లి లేని వాణ్ణి నీ కన్నబిడ్డలా జాగ్రత్తగా చూసుకోవాలి,'' అన్నాడు జంగయ్య. ``ఆమాత్రం నాకూ తెలుసు,'' అంటూ నవ్వింది జగదీశ్వరి.

అయితే, జగదీశ్వరి ఆ ఇంట అడుగుపెట్టి మూడు నెలలు ముగియక ముందే కన్నయ్య కష్టాలు ఆరంభమయ్యాయి. జంగయ్య పట్నంలో దుకాణం మూసేసరికి బాగా పొద్దుపోయి రాత్రయ్యేది. మళ్ళీ తెల్లవారగానే దుకాణం తెరవవలసిన పరిస్థితి ఏర్పడింది. జంగయ్య ఇంటికి వారానికి ఒక్క రోజు మాత్రమే వచ్చేవాడు. దాంతో అడిగేవాళు్ళ లేకుండా పోయిన జగదీశ్వరి కన్నయ్య చేత ఇంటెడు పనీ చేయించేది. స్వతహాగా నెమ్మదస్థుడైన జంగయ్య, కొడుకు ఏం చెప్పినా భార్యను పల్లెత్తు మాట అనేవాడు కాదు. అందువల్ల ఏడాది తిరగకుండా ఆ ఇంట్లో జగదీశ్వరి ఆడింది ఆట, పాడింది పాటగా తయారయ్యింది. ఒక రోజు ఉదయం బడికి బయలుదేరుతూన్న కన్నయ్య చేతిలోని పుస్తకాలు విసురుగా లాక్కుని, ``నువు్వ చదువుకుని ఊరిని ఉద్ధరించేది ఏమీలేదు. నీ తిండికే బోలెడు ఖర్చవుతోంది. నువు్వ ఈ రోజు నుంచి బడి మాని అడవికి వెళ్ళి, ఎండు పుల్లలు ఏరుకురా. వంటచెరకు ఖర్చయినా తప్పుతుంది,'' అన్నది జగదీశ్వరి. కన్నయ్యకు చదువంటే ప్రాణం. సవతి తల్లి బడిమానమనగానే వాడికి ఏడుపు వచ్చేసింది, ``నా చేత చదువు మానిపించవద్దు పిన్నీ. సాయంత్రం బడి నుంచి వచ్చాక కావలసి నన్ని పుల్లలు తెస్తాను,'' అన్నాడు ఏడుపు గొంతుతో. ``సాయంత్రం చేయడానికి వేరే పనులున్నాయి, నడు, నడు,'' అంటూ జగదీశ్వరి కన్నయ్యను అడవికి పంపింది. కన్నయ్య నదిగట్టునే నడిచి వెళ్ళి మధ్యాన్నానికి అడవి చేరాడు. వాడక్కడ ఎండు పుల్లలు ఏరి, మోపుగా కట్టి నెత్తిన పెట్టుకుని ఇల్లు చేరేసరికి చీకటిపడింది. ``ఈ నాలుగు పుల్లలు ఏరుకురావడానికి ఇంతసేపా?'' అంటూ విరుచుకు పడింది జగదీశ్వరి. ఆ రోజు మొదలు ఇంటి పనితో పాటు, అడవికి వెళ్ళి పుల్లలు తేవడం కన్నయ్యకు తప్పడం లేదు. శరీర కష్టం కన్నా, చదువు మానవలసి వచ్చినందుకు మనసులో బాధ పడసాగాడు.

ఒకనాడు అడవిలో ఎండుపుల్లలు ఏరుతూన్న కన్నయ్యకు, రేగుపొదల మధ్య బంగారు రంగుతో మెరుస్తూన్న ఈక ఒకటి కనిపిం చింది. ఆ ఈకను జంగయ్య అతి ప్రయత్నం మీద జాగ్రత్తగా బయటకు తీశాడు. అది బంగారు రంగుతో ధగధగా మెరిసిపోవడమే గాక, సువాసనలు కూడా వెదజల్లుతోంది. కన్నయ్య ఆశ్చర్యంతో ఆ ఈకను అటూ ఇటూ తిప్పి చూస్తూండగా, కళ్ళ ముందు ఒక మెరుపు మెరిసినట్టయి, ఒక దేవతాస్త్రీ ప్రత్యక్షమయింది. ఆ దేవతకు అందమైన రెక్కలున్నాయి. అవి బంగారు రంగుతో మిలమిలా మెరిసిపోతున్నాయి. ``చిన్న వయసులో కష్టపడుతూన్న నిన్ను చూస్తూంటే జాలి కలుగుతోంది,'' అన్నది రెక్కలదేవత. ``మా నాన్న సంపాదన తిండికే చాలక నేను ఇలా కష్టపడవలసి ఉంది. అయితే, నా బాధ మాత్రం చదువు మానేసినందుకే. నా మీద అంత జాలిగా ఉంటే, మరి ఇన్నాళూ్ళ నాకు కనిపించలేదేం?'' అని అడిగాడు ఆశ్చర్యంగా కన్నయ్య. ``ఈ అడవిలో నా ఈక ఎవరి దగ్గర ఉంటే వారికే కనిపిస్తాను. ఇతరులకు కనిపించను. నేను నీకు సాయపడాలనుకుంటున్నాను. నీ చేతిలోని ఈకతో నా రెక్కలను మూడుసార్లు తాకావంటే బంగారు నాణాలు రాలుతాయి. వాటితో మీదరిద్రం తీరిపోతుంది నీకీ కష్టాలు తప్పుతాయి. నువ్వెళ్ళి హాయిగా చదువుకో వచ్చు,'' అన్నది దేవత. ఆ మాటకు కన్నయ్య నవ్వి, ``కష్టపడకుండా సంపాదించిన డబ్బుతో తృప్తిగా బతకలేం అని బడిలో మా గురువుగారు చెబుతూండేవారు. నీ బంగారు నాణాలు నాకు వద్దు,'' అన్నాడు. కన్నయ్య మాటలకు ముచ్చటపడిన దేవత, ``అయితే, నువు్వ పుల్లలు ఏరేదాకా నీతో కబుర్లు చెబుతాను. నీకు కష్టం తెలియదు,'' అన్నది. దేవత చెప్పే మంచి మాటలు వింటూ, ఆమె రెక్కలు విసురుతూ ఉంటే వచ్చే సుగంధ భరితమైన చల్లటి గాలులతో సేదతీరుతూ, సునాయాసంగా కట్టెల మోపు సిద్ధంచేశాడు కన్నయ్య. ``నా వీపు మీద కూర్చో. నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను. ఆ ఈకను ఎవరి కంటా బడకుండా భద్రంగా దాచుకో.

 అది పోగొట్టుకుంటే నేను నీకు కనిపించను,'' అంటూ దేవత అందమైన పెద్ద పక్షిగా మారిపోయింది. ఆ తరవాత కన్నయ్యను వీపు మీద కూర్చోబెట్టుకుని, ఆకాశంలో ఎగురుతూ వచ్చి వాళ్ళ ఇంటి పెరట్లో దింపి వెళ్ళిపోయింది. రాత్రి వంటకు బియ్యం సిద్ధంచేస్తూన్న జగదీశ్వరి, ``ఈ రోజు చాలా పెందలాడే తిరిగి వచ్చావు. అయినా పెరటి దోవన వచ్చావేమిటి?'' అని అడిగింది అనుమానంగా. ``పెరటి దోవన అడవికి అడ్డుదారి ఉందిలే,'' అంటూ కాళు్ళ చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు కన్నయ్య. అది మొదలు కన్నయ్య దేవత ఈకను పగలు భద్రంగా తన దుస్తుల్లో దాచుకునేవాడు. రాత్రుల్లో తలకింది దిండులో రహస్యంగా దాచేవాడు. అడివికి వెళ్ళగానే ఈకను తీసి చేతిలో పట్టుకోగానే దేవత ప్రత్యక్షం అయ్యేది. దేవత కబుర్లు వింటూ కష్టం తెలియకుండా పుల్లలు ఏరుకునే వాడు. దేవత రోజూవాణ్ణి ఇంటి వద్ద దిగవిడిచి వెళ్ళేది. ఆరోజు కన్నయ్య పొరబాటున దిండు కింద దాచిన ఈకను తీసుకోవడం మరిచిపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు. పక్కలు సరిచేస్తూన్న జగదీశ్వరికి, కన్నయ్య దిండు కింద బంగారు రంగులో సుగంధాలు వెదజల్లుతూన్న ఈక కనిపించింది. ఆ ఈకను చూడగానే జగదీశ్వరి కళు్ళ చెదిరిపోయాయి. ఆ ఈకను అప్పటికప్పుడే ఊళ్ళో వున్న స్వర్ణకారుడి వద్దకు తీసుకువెళ్ళింది. దాన్ని పరిశీలించి చూసిన స్వర్ణకారుడు, ``ఇదంతా మేలిమి బంగారం. దీనిని నాకు ఇస్తే వెయ్యి వరహాలు ఇస్తాను,'' అన్నాడు. ``దీనిని అమ్మాలనుకుంటే నీ దగ్గరికే వస్తానులే!'' అన్నది జగదీశ్వరి. ఆమె ఇంటికి వచ్చి తియ్యటి సున్నివుండలు తయారు చేసింది. సాయంత్రం కన్నయ్య రాగానే, ``ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నాడు నా తండ్రి, '' అంటూ చెంగుతో వాడి మొహంమీది చెమట తుడిచి, కొసరి కొసరి సున్నివుండలు తినిపించింది. జగదీశ్వరి కనబరుస్తున్న ఆప్యాయతకు కన్న తల్లి గుర్తుకు వచ్చి కళ్ళనీళు్ళ తిరిగాయి కన్నయ్యకు. ఇదే సమయమని జగదీశ్వరి బంగారు ఈకను చూపించి, ``ఈ ఈక నీ దిండు కిందికి ఎలా వచ్చింది? తల్లిలాంటి దాన్ని. నా దగ్గర దాపరికం దేనికి? దీనిని నీకు ఎవరు ఇచ్చారో చెప్పు,'' అని అడిగింది. కన్నయ్య రెక్కల దేవత గురించి అంతా జగదీశ్వరికి చెప్పి, ``అడవిలోకి వెళ్ళి, ఈ ఈకను చేతిలో పట్టుకుంటే దేవత ప్రత్యక్షమవుతుంది,'' అన్నాడు.

మరునాడు ఉదయం జగదీశ్వరి, ``కన్నయ్యా, నీకు చదువు అంటే ప్రాణం కదా. పాపిష్టిదాన్ని మధ్యలోనే చదువు ఆపించాను. ఈ రోజునుంచి నా కష్టాలేవో నేను పడతాను. నువు్వ బడికి వెళు్ళ,'' అన్నది. కన్నయ్య పుస్తకాలు తీసుకుని సంతోషంగా బడికి వెళ్ళాడు. వాడు అటు వెళ్ళగానే జగదీశ్వరి దేవత ఈకను కొంగు చాటున దాచుకుని ఒక గొడ్డలి తీసుకుని అడవికి బయలుదేరింది. అడవిలోపలికి వెళ్ళి, ఈకను ఎడమ చేత్తో పట్టుకుని, కుడిచేతిలోని గొడ్డలితో పక్కనున్న చెట్టును నరుకుతూన్నట్టు నటించసాగింది. అంతలో, ``ఆగు. అదేంపని? పచ్చని చెట్టును నరకడం మహాపాపం!'' అంటూ రెక్కల దేవత ప్రత్యక్షమయింది. ``ఏం చేయమంటావు తల్లీ. మా కన్నయ్య తెచ్చే నాలుగు పుల్లలతో మా దరిద్రం తీరేదేనా?'' అంటూ విచారంతో చేతులు తిప్పింది జగదీశ్వరి. ``కన్నయ్యను కష్టపెట్టకుండా చదువుకోనిస్తే నీకు సాయంచేస్తాను. చదువులేకపోతే మనిషికీ, ఈ అడవిలోని మానుకూ తేడా ఏమీ లేదు,'' అన్నది దేవత. ``తప్పక చదివిస్తాను తల్లీ. ఆ చేసే సాయమేదో తొందరగా చెయ్యి,'' అన్నది జగదీశ్వరి. ``నీ చేతిలోని నా ఈకతో నా రెక్కల మీద మూడుసార్లు తాకావంటే బంగారు నాణాలు రాలుతాయి,'' అన్నది దేవత. వెంటనే జగదీశ్వరి ఈకను దేవత రెక్కల మీద మూడుసార్లు తాకించింది. 

రెక్కల నుంచి కొన్ని బంగారు నాణాలు రాలాయి. వాటిని చూసి అబ్బుర పడిన జగదీశ్వరి మళ్ళీ ఈకతో దేవత రెక్కలను తాకించబోయింది. ``రోజుకు ఒక్కసారి మాత్రమే నాణాలు రాలుతాయి,'' అంటూ దేవత అదృశ్యమయింది. ఆ నాణాలతో ఇంటికి వచ్చిన జగదీశ్వరికి రాత్రంతా నిద్ర పట్టలేదు. అప్పటికప్పుడే అందరికన్నా ధనవంతురాలు కావాలని ఆత్రంతో ఆలోచించింది. మరునాడు తెల్లవారగానే గొడ్డలిని భుజానవేసుకుని అడవికి వెళ్ళి, ఈకను తీసి పట్టుకున్నది. ``మళ్ళీ వచ్చావెందుకు?'' అంటూ దేవత ప్రత్యక్షమయింది. ``నువు్వ నిన్న ఇచ్చిన నాణాలు పాతబాకీలు తీర్చడానికే సరిపోయాయి. ఇక కన్నయ్యను ఎలా చదివించను చెప్పు?'' అన్నది జగదీశ్వరి విచారంగా. ``దిగులు పడకు. ఈకను నారెక్కలకు తాకించు,'' అన్నది దేవత. జగదీశ్వరి అలా చేయడంతో రెక్కల నుంచి జలజలా బంగారు నాణాలు రాలాయి. వాటినంతా మూట కట్టుకున్న జగదీశ్వరి, ``ఈ ఎండలో నడవలేను. ఇంటి దగ్గర దింపు తల్లీ,'' అన్నది దేవతతో. పెద్ద పక్షి రూపమెత్తిన దేవత జగదీశ్వరిని తన వీపున కూర్చోబెట్టుకుని బంగారు రెక్కలల్లారుస్తూ ఆకాశ మార్గాన బయలుదేరింది. అవకాశం కోసం చూస్తూన్న జగదీశ్వరి, తన చేతిలోని గొడ్డలితో దేవత బంగారు రెక్కలను తెగ నరకాలని ప్రయత్నించి, అదుపు తప్పి, అంతపై నుంచి కింది అగాథంలోకి పడిపోయింది. ఆమె చెంగులోని ఈక గాలికి ఎటో ఎగిరిపోయింది. ఆ తరవాత ఆమె ఏమై పోయిందో ఎవరికీ తెలియలేదు! భార్య కోసం పది రోజులు వెతికిన జంగయ్య, ఆమె జాడ కనిపించక పోయేసరికి, ఇక పల్లెలో ఉండలేక వచ్చిన ధరకు ఇల్లు కూడా అమ్మేసి పట్నానికి మకాం మార్చేశాడు. పట్నంలోని పెద్ద బడిలో చదువుకునే కన్నయ్యకు తరచూ రెక్కల దేవత గుర్తుకు వచ్చేది. ఆ సంగతి చెబితే, ``అంతా నీ భ్రమ! పోనీలే. ఆ దేవత ఎన్నో మంచి మాటలు చెప్పిందన్నావు కదా. వాటిని ఆచరిస్తూ, బాగా చదువుకుని జీవితంలో పైకిరా,'' అనేవాడు జంగయ్య నవు్వతూ. 

No comments:

Post a Comment