Pages

Sunday, September 16, 2012

సన్మానయోగం

సుకావ్యుడు జనకారణ్యంలోని గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు.తన పాండిత్యంతో రాజును మెప్పించాలని రాజధానికి వస్తే రాజదర్శనం దుర్లభమయింది. జీవనోపాధికి దారితోచని సమయంలో, అతడికి జగన్నాధుడనే పండితుడు తన ఇంట అశ్రయమివ్వడమేగాక,తన కూతురునిచ్చి పెళ్ళి చేశాడు.

సుకావ్యుడక్కడే స్ధిరపడి,విద్యార్ధులకు పాఠాలు బోధిస్తూ,రోజులు వెళ్ళబుచ్చసాగాడు.అయితే, ఎప్పటికైనా రాజాశ్రయం పొందాలన్న అతడి కోరిక మాత్రం అలాగే ఉండిపొయింది.అలా కొన్నేళ్ళు గడిచాయి.

ఈ వ్యవధిలొ సుకావ్యుడు ప్రజాయణం అనే కావ్యం రచించాడు.జగన్నఆధుడాకావ్యాన్ని చదివి,"నీ కావ్యం అద్భుతంగా ఉన్నది.ఇది నీకెంతో పేరు తెచ్చిపెడుతుంది.కానీ, అందుకు ప్రచారం కావాలి.ప్రచారానికి రాజాశ్రయం కావాలి," అన్నాడు.

సుకావ్యుడు రాజాస్ధాన కవిని కలిస్తే ఆయన కావ్యం చదివి,"రాజు ప్రజలకు దేవుడు.నువ్వు నీ కావ్యంలో ప్రజలను రాజుకు దేవుళ్ళను చేశావు.ఇది పాపం.పాపానికి రాజాశ్రయం లభించదు.ఇప్పుడే కాదు; ఇంకెప్పుడూ నువ్వీ దరిదాపులకు రావద్దు," అని హెచరించి పంపేశాడు.

జరిగింది విన్న జగన్నాధుడు, "ఆస్థాన కవి నీ కావ్యం గొప్పగా ఉన్నదని గ్రహించి అసూయతో నీకు రాజ దర్శనం కలక్కుండా చేశాడు. నువ్విక రాజాశ్రయం లేకుండానే పేరు తెచ్చుకోవాలి," అన్నాడు.

ఇది జరిగిన వారం రోజులకు నాగపురం నుంచి రవీంద్రుడనే దూరపు బంధువు రాజధానికి వచ్చి,జగన్నాధుడి ఇంట బస చేశాడు.మాటల సందర్భంలో సుకావ్యుడి విషయం తెలిసి,"మా ఊళ్ళోని కీర్తికాముకుడు బాగా డబ్బు సంపాదించాడు.ఇప్పుడు పేరు ప్రతిష్ఠల కోసం తాపత్రయ పడుతున్నాడు మీ

అల్లుడు ఆయన్ను కలిస్తే ప్రయోజనముండవచ్చు," అని జగన్నాధుడికి చెప్పాడు.

సుకావ్యుడు నాగపురం వెళ్ళీ కీర్తికాముకుణ్ణి కలుసుకుని విషయమంతా దాచకుండా చెప్పాడు.

కీర్తికాముకుడికి పేరు తెచ్చుకోవాలన్న ఆశ ఉన్నప్పటికి, డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు.పైగా ప్రజలే రాజుకు దేవుళ్ళని చేప్పే కావ్యాన్ని సన్మానిస్తే రాజుకు తన మీద కోపం రావచ్చని భయపడ్డాడు. అతడు సుకావ్యుడితో,"నాకు కవిత్వం గురించి అంతగా తెలియదు. యోగపురంలోని ప్రముఖ వ్యాపారి జనవంధ్యుడు సాహితీ ప్రియుడు. నువ్వతన్ని కలిస్తే ప్రయోజనం ఉండవచ్చు." అన్నాడు.

కీర్తికాముకుడు అలా చెప్పడంలో మర్మముంది.జనవంద్యుడు వైభవంగా జీవిస్తూనే, పరోపకారీ,సాహితీ ప్రియుడూ అని పేరు గాంచాడు."డబ్బుండగానే సరిపోదు.జనవంద్యుడిలాంటి అభిరుచి ఉండాలి," అని చుట్టుపక్కల చెప్పుకునేవారు.

కీర్తికాముకుడికి పరోపకార గుణమూ లేదు;సాహిత్యం పట్ల అభిరుచీ లేదు. తను చేయలేనివి చేస్తూన్న జనవంద్యుడంటే అసూయతో అతడికి చెడ్డపేరు తేవాలనునుకున్నాడు.ఇప్పుడు జనవంద్యుడు సుకావ్యుణ్ణి సన్మానిస్తే-రాజు గారికి కోపం.సన్మానినించకుంటే, జనవంధ్యుడి సాహితీ ప్రియత్వం అబధ్దమని తనే ప్రచారం అచేయాలని కీర్తికాముకుడి దురాలోచన.

అయితే, సాహితీ ప్రియుడైన జనవంద్యుడు సుకావ్యుడి ప్రజాయణం చదివి ముగ్ధుడై, అతడికి ఘనంగ సన్మానం చేసి, పదివేల వరహాలు కానుకగా ఇచ్చాడు.మహకవిగా సుకావ్యుడికీ, గొప్ప సాహితీ పోషకుడిగా జనవంద్యుడికీ పేరొస్తే-అది తెలిసి మహారాజు వాళ్ళిధ్దర్నీ పిలిపించి రాజసన్మానం చేశాడు.

ఇది ఊహించని కీర్తికాముకుడు మానసికంగా దెబ్బతిన్నాడు.

ఇలా ఉండగా,పాతికేళ్ళ ప్రాయంలో ఊరు వదిలి వెళ్ళిన సంచారుడు, విదేశాలలో బాగా డబ్బు గడించి వృద్ధాప్యాన్ని తన వాళ్ళ మధ్య గడపాలని నాగపురానికి తిరిగి వచ్చాడు.అప్పటికి కీర్తికాముకుడు తప్ప,సంచారుడి బంధువులెవరూ అక్కడ లేరు.సంచారుడి వద్ద బాగా డబ్బున్నదని తెలియడంతో, ఆయన్ను కీర్తికాముకుడు తన ఇంటికి పిలిచి విందు


భోజనం పెట్టాడు. అందుకు సంతోషించిన సంచారుడు," ఇప్పుడు నా వద్ద కావలసినంత డబ్బున్నది. దానికి తగ్గ పేరు ప్రఖ్యాతులు లేవు. ఏం చేస్తే బావుంటుందంటావు?". అని అడిగాడు.

"డబ్బు ఖర్చు పెట్టాలేగాని, అదెంతపని? నిన్న గాక మొన్న జనవంద్యుడనే వ్యాపారి, సుకావ్యుడనే కవిని సన్మానించి, సాహితీ పోషకుడని ప్రజల మన్ననలు పొందడమే గాక, రాజుగారి నుంచి కూడా సన్మానం పొందాడు. నువ్వు కూడా సుకావ్యుడి కావ్యాన్ని అంకితం పుచ్చుకుని సన్మానించావంటే నీ పేరు నలు దిశలా మారుమోగి పోతుంది," అన్నాడు కీర్తికాముకుడు.

సంచారుడు అందుకు సమ్మతించడంతో, కీర్తికాముకుడు సుకావ్యుణ్ణి పిలిపించి, "నేను నీకు జనవంద్యుణ్ణి గురించి చెప్పడం వల్లే కదా నీకింత పేరు వచ్చింది. ఇప్పుడు మరొక కావ్యం రచించి మా బంధువు సంచారుడికి అంకితమిచ్చి, ఆయన సన్మానం స్వీకరించు," అన్నాడు.

సుకావ్యుడు అందుకు అంగీకరించి,"మనుషులకు మాత్రమే కాకుండా, సకల జీవరశులకూ ప్రకృతి ఎన్ని రూపాల్లో సహకరించి సాయపడుతున్నదో వివరిస్తూ,'ప్రకృతి పురాణం' అనే కావ్యం నేనిప్పుడు రచిస్తున్నాను. అది మరో పక్షం మరో రోజుల్లో పూర్తి కాగలదు," అని చెప్పి వెళ్ళాడు.

కొంతసేపయ్యాక కీర్తికాముకుడు,"సుకావ్యుణ్ణి సన్మానించడంతో పాటు, సుందర ప్రదేశంలో గొప్ప భవనం నిర్మించి, దానికి మీ వంశం పేరు పెడితే, మీ కీర్తి శాశ్వతంగా నిలబడగలదనుకుంటాను," అన్నాడు సంచారుడితో.

"ఆలోచన బావుంది. మరి ఎక్కడ నిర్మిద్దామంటావు?" అని అడిగాడు సంచారుడు."మన నదీ తీరంలో చాలా అందమైన స్ధలం నాకు సొంతంగా ఉంది. దాన్ని మీకు అమ్ముతాను. అక్కడ నిర్మించవచ్చు," అన్నాడు కీర్తికాముకుడు.

సంచారుడు అందుకు అంగీకరించి,ఆ స్ధలాన్ని వెంటనే కొని, చదును చేయడానికి అక్కడున్న చెట్లను నరికించడం మొదలు పెట్టాడు.
పక్షం రోజులు గడిచాక పిలుపురావడంతో, సుకావ్యుడు నాగపురం వెళ్ళి అక్కడి దృశ్యం చూసి దిగ్ర్భాంతి చెందాడు.

సంచారుడు తను నిర్మించ తలపెట్టిన భవనం గురించి చెప్పి,"నీ ప్రకృతి పురాణం పూర్తయిందా? సన్మాన కార్యక్రమం ఎప్పుడు ఏర్పాటు చెయమంటావు?" అని అడిగాడు ఉత్సాహంగా.

"కావ్యం పూర్తి కావచ్చింది.అయినా దాన్ని తమకు అంకితమివ్వలేను," అన్నాడు సుకావ్యుడు.

"ఎందుకు? నీకు సన్మానం,నీ కావ్యానికి ప్రచారం అవసరంలేదా?" అని అడిగాడు పక్కనే ఉన్న కీర్తికాముకుడు కాస్త ముందుకు వచ్చి ఆశ్చర్యంతో.

"ప్రజా హృదయాలలో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందింప జేయడానికి నేను 'ప్రకృతి పురాణం' రచిస్తున్నానని తెలియగానే, జనవంద్యుడు యోగపురం నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అందులోని పద్యాలను చదువుతూండగా విని తన్మయత్వం చెందాడు.దాని నుంచి పొందిన స్ఫూర్తితో ఇక పై సాహితీ పోషణతో పాటు, ప్రకృతి పరిరక్షణకు కూడ పాటుపడగలనని మాట ఇచ్చాడు. అలాంటి వారికి అంకితమిస్తేనే నా కావ్యానికి సార్ధకత సిధ్దిస్తుందని భావిస్తున్నాను. అందుకే నా కావ్యాన్ని జనవంద్యుడికే అంకితమివ్వాలని నిర్ణయించాను," అన్నాడు సుకావ్యుడు.

ఆ మాటల్లో నిజం ఉందని గ్రహించిన సంచరుడు, "చక్కని నిర్ణయం తీసుకున్నావు.సాహిత్య పోషణతో పాటు, అందులోని మంచి విషయాలను ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం. అదే కవికి నిజమైన సన్మానం. కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడే నాలాంటి వాళ్ళకు నీవంటి గొప్ప కవులను సన్మానించే యోగం లభించదు.నిజమైన సాహితీ ప్రియులకే అది సాధ్యం.ఇక్కడ మరికొన్ని ఫలవృక్షాలను నాటించి పెంచుతాను.దానికి 'ప్రకృతి పురాణవనం' అని పేరు పెట్టి ప్రకృతి పరిరక్షణకు నా చేతనైన కృషి చేస్తాను. నువ్వు జనవంద్యుడికి నీ కావ్యాన్ని అంకితమిచ్చే రోజును చెప్పావంటే, కీర్తికాముకుణ్ణి వెంటబెట్టుకుని నేనూ సన్మాన సభకు వస్తాను," అన్నాడు.
సుకావ్యుడు సంతోషంగా అక్కడి నుంచి రాజధానీ నగరానికి బయలుదేరాడు. 

No comments:

Post a Comment