Pages

Sunday, September 16, 2012

వ్యాపార బాధ్యత!


సింగవరంలో ధాన్యం వ్యాపారం చేస్తున్న నాంచారయ్య బాగా సంపాదిస్తున్నాడు. దానగుణం, దైవభక్తి గల ఆయన ఒక ధర్మసత్రం, రామాలయం నిర్మించి; సత్రంలో పేదలకు అన్నదానం చేయడం, రామాలయంలో తరచూ హరికథలు చెప్పడంఏర్పాటు చేశాడు. ఒకనాటి రాత్రి ఆయన భోజనం చేస్తూండగా, భార్య తాయారమ్మ, ``చేతికి అందివచ్చిన ముగ్గురు కొడుకులు ఉన్నారు.
 
ఇంకా మీరే వ్యాపారమంతా తలకెత్తుకుని అవస్థపడడం దేనికి? ముగ్గురిలో ఒకరికి వ్యాపారం అప్పగించవచ్చుకదా?'' అని అడిగింది. ``నేనూ అదే ఆలోచనలో ఉన్నాను. ముగ్గురిలో ఎవరికి అప్పగిస్తే మన ఆస్తిపాస్తులకు, గౌరవమర్యాదలకు భద్రత ఉంటుందా అని ఆలోచిస్తున్నాను,'' అన్నాడు నాంచారయ్య. ``దానికెందుకు అంత పెద్ద ఆలోచన? అబ్బాయిలు ముగ్గురూ మంచివాళ్ళే కదా.
 
ఎవరికి అప్పగించినా నిక్షేపంగా నిర్వహించగలరు,'' అన్నది తాయారమ్మ. ``కన్న బిడ్డల మీది మమకారం కొద్దీ అలా అంటున్నావేగాని, వ్యాపారానికి ఒక్క మంచితనం మాత్రమే చాలదు. తెలివితేటలతో పాటు చేసే వ్యాపారం పట్ల ఆసక్తి ఉండాలి. అది మన ముగ్గురు కొడుకులలో ఎవరికి ఉన్నదో తెలుసుకోవడానికి చిన్న పరీక్షపెడతాను. వారి సమర్థతను నువ్వే చూద్దువుగాని,'' అన్నాడు.
 
మరునాడు నాంచారయ్య ముగ్గురు కొడుకులనూ చేరబిలిచి, ముగ్గురికీ తలా ఒక రూపాయి నాణెం ఇచ్చి, ``ఈ రూపాయితో సాయంకాలంలోగా ఏదైనా ఒక మంచి పని చేసిరండి. దాంతో మీ దక్షత ఏపాటిదో బయటపడుతుంది,'' అని చెప్పి అంగడికి వెళ్ళాడు. సాయంకాలం ఇంటికి వచ్చిన నాంచారయ్య ముగ్గురు కొడుకులూ తన కోసం ఎదురు చూస్తూండడం గమనించాడు.

ఆయన మొదట పెద్దవాడైన సోమశేఖరాన్ని పిలిచి, ``నువు్వ నేనిచ్చిన రూపాయి నాణెంతో ఏ మంచి పని చేశావు?'' అని అడిగాడు. ``రామాలయం దగ్గర ఆకలితో అలమటిస్తూన్న వృద్ధురాలికి దానిని ఇచ్చాను,'' అన్నాడు సోమశేఖరం. నాంచారయ్య చిన్నగా నవు్వతూ, నువ్వేం చేశావు అన్నట్టు రెండవ కొడుకు రామబ్రహ్మం కేసి చూశాడు. ``మన వ్యాపారం అభివృద్ధి చెందాలని గుడిలో పూజ చేయించి, రూపాయిని పూజారి పళ్ళెంలో వేశాను,'' అన్నాడు రామబ్రహ్మం.
 
నాంచారయ్య అదే చిరునవు్వతో చిన్న కొడుకు నారాయణ కేసి చూస్తూ, ``నువ్వేం చేశావు?'' అని అడిగాడు. నారాయణ మౌనంగా తన జేబులో నుంచి రూపాయి నాణెం తీసి తండ్రి ముందుంచాడు. ``రూపాయిని ఖర్చు చేయకుండా అలాగే పొదుపు చేశావా?'' అని అడిగాడు నాంచారయ్య. ``లేదు నాన్నా! మీరిచ్చిన రూపాయితో తోట దగ్గరికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు కొన్నాను. అంగడి వీధిలో ఒక అరుగు పక్కన కూర్చుని, ఇవి చాలా ప్రశస్తమైన నిమ్మకాయలని చెప్పి వాటిని రెండు రూపాయలకు అమ్మాను.
 
లాభంగా వచ్చిన రూపాయితో అర్ధ రూపాయికి అటుకులు కొని, ఆకలితో ఉన్న పిల్లవాడికిచ్చాను. అర్ధ రూపాయిని అందరినీ చల్లగా చూడమని దేవుడి హుండీలో వేశాను. మిగిలిన అసలు రూపాయినిమీకిచ్చాను,'' అన్నాడు నారాయణ నెమ్మదిగా. అతడి తెలివితేటలకూ, దయాగుణానికీ ముగ్థుడైన నాంచారయ్య అతనికే తన వ్యాపారాన్ని అప్పగించాలని నిర్ణయించాడు. ఇద్దరి కొడుకుల కేసి తిరిగి, ``ఏమంచి పని చెయ్యాలన్నా డబ్బు అవసరం. వ్యాపారానికి అది మరీ ముఖ్యం.
 
అందువల్ల వ్యాపారం చేయదలచినవాడు ముందు చేయవలసింది లాభం సంపాదించడం. నారాయణ ఆ పని చేశాడు. డబ్బు సంపాదించాక దానధర్మాలు. మీలో ఒకరు మన ధర్మసత్రాన్నీ, మరొకరు రామాలయం బాధ్యతలూ చూసుకుంటూ, తము్మడికి వ్యాపారంలో సహకరించండి,'' అన్నాడు. అన్నలిద్దరూ అందుకు సంతోషంగా సమ్మతించారు. భర్త నిర్ణయానికి భార్య తాయారమ్మ ఎంతోగానో సంతోషించింది.

No comments:

Post a Comment